Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Programmes. Show all posts
Showing posts with label Programmes. Show all posts

Monday, 11 August 2025

National Deworming Day Programme at MPPS Uppununthala Boys

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన డాక్టర్ స్వప్న:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైద్య అధికారి స్వప్న గారు కార్యక్రమం ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారము, ఈగలు వాలిన తినుబండారాలు దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా, కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వ్యాప్తి చెందుతాయి. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండుట వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోని నులిపురుగులు వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వలన వ్యాప్తి చెందుతాయి. కావున చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. జంక్ ఫుడ్ తినొద్దని, తాజ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణిస్తారు కాబట్టి ఈ జాగ్రత్తలు విద్యార్థులు అందరూ పాటించాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, హెల్త్ అసిస్టెంట్ డి. శ్రీనివాసులు, ఎ.ఎన్.ఎంలు దేవి, వీణ, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tuesday, 5 August 2025

91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tuesday, 29 July 2025

RBSK team visit and screen all the students and give medicine at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు:

ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 19 July 2025

Shoes and School Bags free distribution by Maryada Foundation 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:


ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు

మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.

Thursday, 10 July 2025

Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ గురుపౌర్ణమి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పౌర్ణమి కి ప్రత్యేకత ఉందని, అజ్ఞానం అనే అంధకారాన్ని, చీకటిని పారద్రోలే పౌర్ణమి రోజు ఉండే నిండు వెన్నెల వెలుతురు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు తదాగత బుద్ధుడు జ్ఞానోదయం పొంది దుఃఖం నివారణ మార్గాన్ని తన ఐదుగురు శిష్యులకు బోధించాడని, దీన్నే ధర్మ చక్ర ప్రవర్తన అంటారని తెలియజేశారు. ఇదే రోజు వేద జ్ఞానాన్ని అందించిన వ్యాసమహర్షి జన్మించారని తెలియజేశారు. ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా జ్ఞానాన్ని పొంది, నైతిక విలువలను తెలుసుకొని, సత్ప్రవర్తనతో మెలిగి సత్కార్యాలు చేసి తాము ఎదుగుతూ, సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జ్ఞానాన్ని అందించిన వారికి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉంటూ వారిని గౌరవించాలన్నారు.


Friday, 20 June 2025

11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.

Thursday, 19 June 2025

Sports Day Celebrations at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు , ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన సంగీత లు మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు  కాబట్టి పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు కాబట్టి వారిని ఆడుకోనివ్వాలన్నారు.



Monday, 16 June 2025

FLN Quiz has been conducted at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme 2025

విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ - విజేతలు బహుమతులు:

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ లో విద్యార్థులను ఐదు గ్రూపులుగా చేసి  తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. విద్యార్థులందరూ ఈ క్విజ్ లో చాలా ఆసక్తిగా, చురుకుగా పాల్గొని సమాధానాలు చెప్పారు. ఈ క్విజ్ లో ఎక్కువ పాయింట్లు సాధించిన గ్రూపు సభ్యులు యశ్వంత్, అశ్విని, భాను ప్రసాద్, అఖిల్, మనస్వి, శ్రవణ్ కుమార్ లకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెన్నులు బహుమతులుగా అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఈ క్విజ్ ల ద్వారా విద్యార్థుల్లో గెలవాలనే పోటీతత్వం, పట్టుదల, విషయ పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి, సమిష్టి కృషి మొదలైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మిగతా విద్యార్థులు తర్వాత చేపట్టబోయే క్విజ్ లో విజయం సాధించేలా బాగా చదవాలని సూచించారు.

Friday, 13 June 2025

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం 2025

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ అక్షరాలు అనేవి ఏ భాషకైనా ప్రాథమికమైనవని, అక్షరాలతో పదాలు, వాక్యాలు, పేరాలు తయారు అవుతాయని అందుకే విద్యార్థులకు అక్షరాలను, వాటి శబ్దాలను అర్థవంతమైన కృత్యాధార పద్దతిలో ఆట పాటలతో నేర్పిస్తున్నామని, చదవడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని, రాయడం ద్వారా భావ వ్యక్తీకరణ చేయొచ్చని, విద్య మనిషిని మహోన్నతుడిని చేస్తుందన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువజన నాయకులు మేడమోని భాస్కర్, మాజీ యంపిటిసి పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థులకు పలకలు అందించిన ఆలూరి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు చెవ్వ పద్మ, విద్యార్థుల తల్లిదండ్రులు బాజ కోటేశు, మస్కూరి మల్లేష్, పాత్కుల కొండలు, సున్నం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.



Friday, 6 June 2025

Grama Sabha at Uppununthala on the occasion of Pro Jayashankar Badi Bata programme







ఈ రోజు ఉదయం 9 గం.లకు ఉప్పునుంతల మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి నారుమోళ్ళ వెంకటేష్ గారి ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి సంవత్సరం విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను గ్రామ ప్రజలకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల రాజస్వ ప్రధానోపాధ్యాయులు& కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి సార్ వివరిస్తూ గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మన పాఠశాల నుంచి 563 మార్కులతో ఎ.నందిని మండలంలో మొదటి ర్యాంకు సాధించిందని, 25 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని, 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్ లు, సుదీర్ఘ అనుభవం కలిగిన, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, 2 జతల ఏకరూప దుస్తులు, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. బాలికల ప్రాథమిక పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ సార్, బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు భోధనోపకరణాలతో, కంప్యూటర్, ప్రొజెక్టర్, ట్యాబ్ , కృత్రిమ మేధాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన చేస్తున్నామని, కంప్యూటర్ విద్యను, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని తెలియజేశారు. బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు హాజరైన వారందరితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని బడిబాట ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, యువకులు ఆలూరి వెంకటేష్ లు మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం అన్నారు. పంచాయతీ కార్యదర్శి పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Wednesday, 4 June 2025

12th state formation day of Telangana celebrations at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం:

ఈరోజు జూన్ 2న ఉదయం 8:45 ని.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీళ్ళు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ వివరిస్తూ సకల జనులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేదావులు, కవులు, కళాకారులు, రచయితలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. శ్రీకాంత చారి లాంటి ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 న ఏర్పాటు కావడం జరిగింది. 12 సం.రాల స్వరాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Thursday, 29 May 2025

PTM conducts in the part of advance Badi Baata programme on 30th May 2025

ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన బోధన: 

ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు మర్రిపల్లి రోడ్డు కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, యువకుల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటిపడే విధంగా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ను ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన అందిస్తున్నారని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికవ్వడం చాలా అభినందనీయం అని ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు బొల్లె లక్ష్మయ్య గారు, గ్రామం అధ్యక్షులు పాత్కుల కురుమయ్య గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తుండటం ఆదర్శమని, మేము కూడా ఈ సంవత్సరం నుంచి మా పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తామని, గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు శ్యాం సుందర్ గౌడ్, శ్రీనివాసులు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ యం.పి.టి.సి సభ్యులు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, శివాజీ యూత్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్, బొల్లె పర్వతాలు, ప్రభాకర్, సుధాకర్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 25 May 2025

PTM conducts in the part of advance Badi Bata on 25th May 2015

 ప్రభుత్వ బడులల్లో ఏఐ & టి.ఎల్.యం తో బోధన: 

ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు దుకాణ సముదాయ కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, మహిళా సంఘాల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి కృత్రిమ మేధా (AI) ఆధారంగా విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇంగ్లీషు మీడియంలో బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని మహిళా సంఘాలను, పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, విద్య ద్వారానే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తున్నారని, కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పద్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Friday, 9 May 2025

PTM conducts in tha part of Advance Badi Bata programme 2025

ఉప్పునుంతలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా పి.టి.ఎం నిర్వహణ:
ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు తిరుమల గుడి కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ పూరిత, అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు, మండల నాయకులు అనంత రెడ్డి గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టే ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తన కుమారున్ని కూడా ఇదే పాఠశాలలో చదివించడం అందరికీ ఆదర్శమని, విద్య ద్వారానే జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని, గౌరవం లభిస్తుంది కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా వారి పిల్లలను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో మాజీ ఎం.పి.టి.సి పాత్కుల రామ్ చంద్రయ్య సైదమ్మ గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, బిసి నాయకులు తిరుపతయ్య గౌడ్ గారు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 10 April 2025

Mahatma Jyoti Rao Phule's 198th Birth Anniversary Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి: 

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 198వ జయంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు జ్యోతిరావు ఫూలే గారి గురించి విద్యార్థులకు వివరిస్తూ వారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి ఫూలేతో కలిసి 1848 వ సంవత్సరంలో బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని వారి సేవలను కొనియాడారు. వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Saturday, 1 March 2025

Self Government Day 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాల విధులు నిర్వహించారు. కలెక్టర్ గా తన్వి, ఎం.ఈ.ఓ గా లోకేష్, కాంప్లెక్స్ హెచ్.ఎం గా హేమంత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు గా కీర్తన లు వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా విద్యార్థులు చేసిన బోధనా కౌశలాలను ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్ పరిశీలించి వారికి అభినందనలు తెలియజేసి మీరు ఈ రోజు పొందిన ఆనందం భవిష్యత్తులో పొందాలంటే బాగా చదువుకుని మీ లక్ష్యాలను సాధించాలని ఆశీర్వదించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు విద్యార్థులను అభినందించి, బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Friday, 28 February 2025

National Science Day 2024 Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా సైన్స్ దినోత్సవం:
ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న C.V రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను 1928 సం.లో ఫిబ్రవరి 28న కనుగొన్న సందర్భంగా 1987 సం నుండి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన దేశంలో విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ విజ్ఞాన దినోత్సవంను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో ఆవిష్కరణల వల్లనే మనం సౌకర్యవంతంగా జీవిస్తున్నాం కాబట్టి విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని తెలుసుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని మూఢనమ్మకాలను నమ్మొద్దు అని తెలియజేశారు. విజ్ఞాన శాస్త్రం/సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన జ్ఞానం అని ప్రతి విషయాన్ని ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలను ఆలోచించి, పరిశోధించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రయోగాలను ప్రదర్శించి వివరించారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

Thursday, 13 February 2025

English Language Day Celebrations at MPPS Uppununthala Boys

 


English Language Day has been celebrated on the occasion of Sarojini Naidu's birth anniversary. Explained importance of English language for bright future. Spelling Bee Quiz Competition has been conducted and presented prizes to the winners Bingi Saidulu, 5th, Varum Tej Edurishetti, 4th, Chanti Aloori, 3rd, Chakravarthy Bolle, 2nd, Richanvitha Aloori, 1st. 

Sunday, 26 January 2025

76th Republic day celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేశభక్తిని చాటుతూ, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు పాడుతూ విద్యార్థులు జాతీయ నాయకుల వేషాధారణలో గ్రామ వీధుల గుండా ప్రభాత భేరి నిర్వహించారు.

ఉదయం 8:30 గంటలకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్  జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు రాజ్యాంగం గొప్పతనాన్ని, పౌరులు అందరూ సమానంగా ఎదగడానికి వారికి కల్పించిన హక్కులను, విధులను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఉపాధ్యాయురాలు సంగీత మేడం మంగలికుంటపల్లి గ్రామంలో మొదటి ప్రభుత్వ ఉద్యోగిగా నిలిచారంటే వారి కృషి, వారి తల్లిదండ్రుల సహకారం, రాజ్యాంగం కల్పించిన అవకాశం అని వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.



Thursday, 5 December 2024

Babasaheb Dr.B.R Ambedkar's 68th Death Anniversary Programme

బాలుర ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు:







 
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి అందరూ పూలతో నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా బాగా చదువుకుని కుల, లింగ వివక్షతలకు, బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారని, రాజ్యాంగం ద్వారా కులాలకు , మతాలకు అతీతంగా బాలబాలికలు అందరూ అభివృద్ధి సాధించడానికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లు, అవకాశాలు, హక్కులు కల్పించారని వివరించారు. అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిత్ర లేఖనంలో ప్రతిభ కనబరిచిన లోకేష్, ప్రశాంత్, సైదులు, వరుణ్ తేజ్ లకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి అభినందించడం జరిగింది.