ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన వార్షిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా ప్రధానోపాధ్యాయులు, అథితులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, ఆంజనేయులు మహనీయుల చిత్ర పటాలకు పూల దండలు వేశారు.
విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు, గురుకుల సీట్లు సాధించడానికి చేసిన కృషిని, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని, మిత్రులతో, ఉపాధ్యాయులతో వారికున్న అనుభూతులను పంచుకున్నారు. తరువాత ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను తెలియచేస్తూ ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో మొత్తం 57 గురుకుల సీట్లు విద్యార్థులు సాధించారని, వారికి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో 1 నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్దతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం మన పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య నర్సరీ, ఎల్ కేజీ, యూ కేజీ తరగతులను కూడా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రవేశ పెడుతున్నాము కాబట్టి మన ఊరి పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. తర్వాత ఉపాధ్యాయులు వెంకటేష్ గారు మాట్లాడుతూ దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాఠశాలకు కావాల్సిన వనరులు సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, నా రెండవ కుమారుడు రాహుల్ ని కూడా ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని, ఇక్కడ సుదీర్ఘ అనుభవం, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ పూరిత వాతావరణంలో బోధనోపకరణాలతో అర్థవంతంగా బోధించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గ్రామ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ గ్రామ సర్పంచ్ చింతగల్ల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు పాత్కుల రిషిత్, ఆలూరి చంటి, పాత్కుల కౌశిక్ కుమార్, నడిగడ్డ విఘ్నేష్, మధనాగుల అలేఖ్య, ఆలూరి హర్బిక, పొట్టల శ్రీనిధి, గోరటి మాధవి లను అభినందించి జ్ఞాపికలను అందచేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి సుమారు 60 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించడం చాలా గొప్ప విషయమని, దానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది. ఈ పాఠశాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు వీరాస్వామి, రామచంద్రయ్య, శ్రీనివాసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





















