ఈరోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యా యులు శ్రీనివాసులు అధ్యక్షతన
స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ ఇక్కడికి 2018 లో బదిలీపై వచ్చినప్పుడు 25 మంది విద్యార్థులతో వసతుల లేమితో ఈ పాఠశాల మూతపడే స్థితిలో ఉన్నదని, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, దాతల సహకారంతో వసతులు సమకూర్చుకుని, నా ఇద్దరు పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందిస్తూ గురుకుల ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకత తరగతులు నిర్వహించి ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తూ ఇప్పటివరకు 56 సీట్లు సాధించడం జరిగింది. తల్లిదండ్రులు ఈ ఫలితాలను చూసి వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని ఇప్పటివరకు విద్యార్థుల సంఖ్యను 102 కు పెంచడం జరిగిందని వివరించారు.
ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరం బట్టి విధానంలో కాకుండా కృత్యాధార పద్ధతిలో ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు. బ్యాగుల పంపిణీ చేస్తున్న మర్యాద ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీరు వసతులు కల్పించాలని గౌరవ శాసనసభ్యులను కోరడం జరిగింది.
మర్యాద ఫౌండేషన్ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగిందని, మా అన్న వాళ్ళు మర్యాద శ్రీనివాస్ రెడ్డి, మర్యాద కృష్ణారెడ్డి లు అమెరికాలో స్థిరపడ్డారని తెలియజేశారు. సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మర్యాద ఫౌండేషన్ స్థాపించి ముఖ్యంగా విద్యాభివృద్ధికి సహకరిస్తున్నమని ఈ సంవత్సరం ఉప్పునుంతల గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు 200 స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గత రెండు సంవత్సరాలలో కూడా విద్యార్థులు అందరికీ బూట్లు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశామని తెలియజేశారు.
ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మాట్లాడుతూ మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఉపాధ్యాయులందరూ సమిష్టి కృషితో అంకితభావంతో పనిచేసి విద్యార్థుల సంఖ్యను 25 నుండి 102 కి పెంచడం అభినందనీయమని ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. తాను పనిచేసే పాఠశాలలోనే తన ఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్న మర్యాద ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, తెలంగాణ మోడల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా పాఠశాలలు స్థాపించి నాణ్యమైన విద్యను అందించాలని కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
గౌరవ ఎమ్మెల్యే గారు విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు.
అనంతరం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, మర్యాద ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాద కృష్ణారెడ్డి గారిని, వెంకట్ రెడ్డి గారిని, నూతన మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారిని పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతగాల్ల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ శైలజ , గ్రామ పెద్దలు డిసిసి ఉపాధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, తహసిల్దార్ సునీత, నాయకులు తిప్పర్తి నరసింహారెడ్డి, మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, పాత్కుల రామచంద్రయ్య, ఆలూరి శ్రీనివాసులు, పాత్కుల నిరంజన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.












0 comments:
Post a Comment