బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేశభక్తిని చాటుతూ, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు పాడుతూ విద్యార్థులు జాతీయ నాయకుల వేషాధారణలో గ్రామ వీధుల గుండా ప్రభాత భేరి నిర్వహించారు.
ఉదయం 8:30 గంటలకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, ఆంజనేయులు సార్, చందన మేడం, సంగీత మేడం లు రాజ్యాంగం గొప్పతనాన్ని, పౌరులు అందరూ సమానంగా ఎదగడానికి వారికి కల్పించిన హక్కులను, విధులను, సామాజిక న్యాయం, సమాజ అభివృద్ధి కోసం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్, వార్డు సభ్యులు జాకటి గీత, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, మాజీ యంపిటిసీ సైదమ్మ రామచంద్రయ్య, యువజన నాయకులు భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కంప్యూటర్ ల్యాబ్ లో ఇన్వర్టర్ ఏర్పాటు కోసం సర్పంచ్ శ్రీనివాసులు గారు 10 వేల రూపాయలు, మాజీ యంపిటిసీ సైదమ్మ రామచంద్రయ్య గారు 5 వేల రూపాయలు, ఉప సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్ గారు 5 వేల రూపాయలు, యువజన నాయకులు భాస్కర్ గారు 10 వేల రూపాయలు ప్రకటించడం జరిగింది. వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి, అభినందించడం జరిగింది.
అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.























